పిల్లలు ఆరోగ్యంగా ఎదగాలంటే సరైన పోషకాహారం ఎంత ముఖ్యమో, అవసరమైన పోషకాలు అందుతున్నాయో లేదో తెలుసుకోవడం కూడా అంతే అవసరం. ఒకటి నుంచి నాలుగు సంవత్సరాల వయస్సు గల పిల్లల్లో రక్త పరీక్షలు చేయించాలనే ఆలోచన చాలా మంది తల్లిదండ్రులకు ఉండదు. అయితే 2024లో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) దేశవ్యాప్తంగా నిర్వహించిన సర్వేలో ఈ వయస్సు పిల్లల్లో మూడు ప్రధాన పోషక లోపాలు ఎక్కువగా ఉన్నట్లు వెల్లడైంది.
1. రక్తహీనత (Anemia)
సర్వే ప్రకారం 100 మంది పిల్లల్లో దాదాపు 40 మందికి రక్తహీనత ఉంది. హిమోగ్లోబిన్ స్థాయి తగ్గిపోవడం వల్ల పిల్లల్లో బలహీనత, అలసట, ఎదుగుదల మందగించడం వంటి సమస్యలు తలెత్తుతాయి.
రక్తహీనతను తగ్గించేందుకు ఐరన్ అధికంగా ఉండే ఆహారాన్ని అందించాలి. స్వచ్ఛమైన తాటి బెల్లం, తేనె, ఎండు ఖర్జూరం పొడి వంటి సహజ ఆహారాలను పరిమితంగా ఆహారంలో చేర్చవచ్చు. అలాగే ఒకటి నుంచి రెండు సంవత్సరాల వయస్సు తర్వాత తోటకూర, పొనగంటి వంటి ఆకుకూరలను ఉడికించి ఆహారంలో ఇవ్వడం వల్ల కూడా ఐరన్ లభిస్తుంది.
హైదరాబాద్లో టీజీఎస్ఆర్టీసీ కొత్త సేవలు.. ఇక ఒకే టికెట్తో బస్సు…ఎలక్ట్రిక్ ఆటో ప్రయాణం.
2. విటమిన్-డి లోపం
100 మంది పిల్లల్లో సుమారు 14 మందికి విటమిన్-డి లోపం ఉన్నట్లు సర్వే వెల్లడించింది. చిన్నపిల్లలు ఎక్కువసేపు ఇంట్లోనే ఉండటం, ఎండలో ఆడుకోకపోవడం దీనికి ప్రధాన కారణంగా భావిస్తున్నారు.
ఉదయం సూర్యరశ్మిలో 20 నుంచి 30 నిమిషాలు పిల్లలను ఆడించడం లేదా కొద్దిసేపు ఎండలో ఉంచడం ద్వారా శరీరానికి సహజసిద్ధంగా విటమిన్-డి లభిస్తుంది. ఇది ఎముకల బలానికి, రోగనిరోధక శక్తి పెరగడానికి ఉపయోగపడుతుంది.
3. విటమిన్-బి12 లోపం
సర్వే ప్రకారం మరో 14 శాతం మంది పిల్లల్లో విటమిన్-బి12 లోపం ఉంది. ఈ విటమిన్ నాడీ వ్యవస్థ, మెదడు అభివృద్ధికి కీలకమైనది.
పుట్టగొడుగులు (మష్రూమ్స్), కోడిగుడ్డు వంటి బి12 సమృద్ధిగా ఉండే ఆహారాలను పిల్లల వయస్సు, వైద్యుల సూచనల మేరకు ఆహారంలో చేర్చడం మంచిది. ముఖ్యంగా గుడ్డు పచ్చసొనలో విటమిన్-బి12 ఎక్కువగా ఉంటుంది.
ప్రయాణాల్లో కూడా తినదగిన శక్తివంతమైన సహజ ఆహారం – కొబ్బరి, అరటి, ఖర్జూరాల కలయిక.
తల్లిదండ్రులు చేయాల్సింది ఏమిటి?
ఒకటి నుంచి నాలుగు సంవత్సరాల వయస్సు గల పిల్లలకు అవసరమైతే రక్త పరీక్షలు చేయించి హిమోగ్లోబిన్, విటమిన్-డి, విటమిన్-బి12 స్థాయిలను తెలుసుకోవాలి. లోపాలు ఉన్నట్లయితే వైద్యుల సలహాతో ఆహారపు అలవాట్లలో మార్పులు చేయడం, అవసరమైతే చికిత్స తీసుకోవడం ద్వారా పిల్లల ఎదుగుదల, రోగనిరోధక శక్తి, మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరచవచ్చు.
గమనిక: పై సూచనలు సాధారణ ఆరోగ్య అవగాహన కోసం మాత్రమే. పిల్లలకు ఏవైనా పోషక లోపాలు ఉన్నాయని అనుమానం ఉంటే తప్పనిసరిగా శిశు వైద్యుడిని సంప్రదించి పరీక్షలు చేయించుకోవాలి.